Рет қаралды 84
భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదా దేవి ( ఆండాళ్ ) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది
20.పాశురము : గానం : అగ్గిరాజు నాగలక్ష్మి గారు
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు
కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;
శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు
వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్;
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్
నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్;
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్
భావం :- ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగనే అటకుపోయి వారిని రక్షించు సమర్ధతగల ఓ స్వామీ! నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ బలశాలీ! శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!' అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి, జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్ధిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కల్గి అతిలోక సుందరముగ విరాజిల్లుచున్న ఓ నీళాదేవీ!మాయమ్మా! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! 'నేను లేచి మీకేమి చేయవలెనందువేమో!' వినుము - మన స్వామియైన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన (విసనకర్ర) నిమ్ము! ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము (అద్దము) నిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ యనుగ్రహమున్ననే కద మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?' అని ఆండాళ్ తల్లి నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో.
అవతారిక :-
నీళాకృష్ణులను మేల్కొలిపి, తమను కరుణించవలెనని గోపికలు ప్రార్ధించారు. యీ మాలికలో ముప్పది మూడు కోట్ల దేవతలకు అధిపతియైన పరమాత్ముని లేపి కరుణించవలసిందిగా ప్రార్ధిస్తున్నారు. సాక్షాత్తూ లక్ష్మీదేవివంటి తల్లియైన నీళాదేవిని కూడా మేల్కొలిపి, తమ విరహార్తికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణునితో కలిపి ఆనందస్నానాన్ని చేయించుమని ప్రార్ధిస్తున్నారు గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి.
#chamarrutemples
#tiruppavaipasuram