Рет қаралды 6,041
Robin hood Story
వేటూరి గారు చాలా ప్రసిద్ధి చెందిన ఒక సినీకవిగానే చాలామందికి తెలుసు. కానీ ఆయన గొప్ప పాత్రికేయుడు కూడా. ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజనత మొదలైన పత్రికలలో సుమారు పదిహేనేళ్ళ పాటూ పనిచేశారాయన. వార్తాంశాలను వ్రాయడంతో పాటూ లెక్కలేనన్ని కలం పేర్లతో ఎన్నో వైవిద్యభరితమైన రచనలు కూడా చేశారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. తెలుగు జర్నలిస్టుల్లో మరెవ్వరికీ లేని ఓ ఘనత మన వేటూరిగారికి మాత్రమే ఉంది. అది స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని ఇంటర్వ్యూ చేయడం. ఇది శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభకాలం నాటి ముచ్చట.
అలానే మహాకవి శ్రీశ్రీగారు మరణించినప్పుడు, ఈనాడు యాజమాన్యం వేటూరిగారితోనే సంపాదకీయం వ్రాయించింది. “చిరంజీవి శ్రీశ్రీ” అనే శీర్షికతో జూన్ 17, 1983వ సంవత్సరంలో ఆయన వ్రాసిన ఆ సంపాదకీయం శ్రీశ్రీగారిపై వచ్చిన నివాళి వ్యాసాలన్నింటిలోకెల్లా ఉత్తమమైంది. “రెండు శ్రీల ధన దరిద్రుడు - కవితా ఘన సముద్రుడు శ్రీశ్రీ” అంటూ మొదటి పేరాలోను, “శ్రీశ్రీ మొదలంటా మానవుడు - చివరంటా మహర్షి - మధ్యలోనే కవి - ఎప్పటికీ ప్రవక్త” అంటూ తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ స్థానమెంతటిదో చెప్పుకొస్తారు వేటూరి. ఇంకా అనూరాధ డైరీ, సరళ సలహాలు, రాష్ట్రగానం, మెరీనాతీరే, నగరసంకీర్తన మొదలైన శీర్షికలతో పత్రికలలో ఆయన చేసిన రచనలు పాఠకులతో పాటూ, ప్రఖ్యాత కథకులనీ, పాత్రికేయులనీ కూడా ఎంతగానో మెప్పించాయి.
అలానే వేటూరిగారు పెట్టే శీర్షికలు కూడా చాలా అర్థవంతంగాను, అందంగాను ఉండేవి. టంగుటూరి ప్రకాశం పంతులుగారు మరణించినప్పుడు “ప్రకాశ విహీనమైన ఆంధ్రప్రదేశ్” అనే శీర్షికతో వ్యాసం వ్రాశారు వేటూరి. అలానే అసెంబ్లీ ముందు ఉండే ద్వారకా హొటల్ని, అందులో బస చేసే తెల్లని బట్టల్లో ఉండే MLAలనీ సంబోధిస్తూ “అదిగో ద్వారక ఆలమందలవిగో” అనే శీర్షిక అప్పట్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అసలు పత్రికలలో వేటూరి రచనా శైలికీ ముగ్ధుడయ్యే NTR వేటూరిగారిని సినిమారంగం వైపు రమ్మని ప్రోత్సహించారు. వేటూరి నావల్ల కాదంటే, మీరు రావల్సిందేనంటూ పట్టుబట్టి మరీ సినీరంగానికి తీసుకొచ్చారు. ఆపై సినీ మహాకవిగా వేటూరిగారు ఎంతటి వెలుగు వెలిగారో, తన తరువాత తరం కవులకు ఎలా దారిదీపంగా మారారో మనందరికీ తెలిసిన విషయమే.
అటువంటి మన వేటూరి గారు 1960లో శుభశ్రీ అనే కలం పేరుతో చేసిన రచనే ఈ రాబిన్హుడ్. రాబిన్హుడ్ పేరు ఇంగ్లాండులో సుమారు 800 సంవత్సరాల క్రితం నుండి వినబడుతోంది. ఉన్నవారి ధనాన్ని కొల్లగొట్టి లేనివారికి పంచిపెట్టే మంచి మనసున్న గజదొంగ ఈ రాబిన్హుడ్. ఇంచుమించు ప్రఖ్యాతి చెందిన ప్రపంచభాషలన్నింటిలోను ఈ రాబిన్హుడ్ కథను ఆధారంగా చేసుకుని, బోలెడన్ని సినిమాలు, నవలలు వచ్చాయి. వేటూరిగారి పుణ్యమా అని ఆ రాబిన్హుడ్ తెలుగువారికి కూడా పరిచయమయ్యాడు. ఆంధ్రపత్రిక సచిత్రవార పత్రికలో 20 వారాల పాటూ ధారావాహికగా ప్రచురింపబడిన ఈ కథ పాఠకులను ఉర్రూతలూగించింది.
వేటూరి గారు ఈ సీరియల్ వ్రాసే సమయానికి, అంటే 1960 ప్రాతంలో ముళ్ళపూడి వెంకట రమణగారు ఆంధ్రపత్రికలో వేటూరిగారికి సహోద్యోగి. వేటూరిగారు సినిమా సెక్షన్ సబ్ ఎడిటర్ అయితే, రమణగారు జనరల్ సెక్షన్ సబ్ ఎడిటర్గా ఉండేవారు. బాపు గారు పత్రికకు బొమ్మలు గీస్తుండేవారు. శివలెంక శంభు ప్రసాద్ గారు ఆ ఆంధ్రపత్రిక యజమాని. ఈ రాబిన్హుడ్ సీరియల్ గురించి కొన్నేళ్ళ క్రితం ముళ్ళపూడి వెంకటరమణగారు పాడుతా తీయగా కార్యక్రమంలో ప్రస్తావించారు. బాలూ గారు రమణగారిని వేటూరిగారితో ఉన్న అనుబంధం గురించి చెప్పమన్నాడు ముందుగా ఈ సీరియల్ గురించి చెప్పి, ఆ సీరియల్ కాదనడానికి వీల్లేనంత బావుంటుందంటూ మెచ్చుకున్నారు. వేటూరిగారు సినీకవిగా మారిన తరువాత బాపూరమణల సినిమాలలో ఎన్నో ఆణిముత్యాలవంటి పాటలు వ్రాశారు. అందుకే వేటూరి ప్రతిభ గురించి రమణగారు చెబుతూ.. సవ్యసాచి అంటే కుడి ఎడమగా కూడా బాణాలు వేయగలడని అర్థం. కానీ వేటూరి గారు మాత్రం కుడి ఎడమ పైన క్రింద ఐమూల అడ్డం ఇలా అన్ని వైపులకూ బాణాలు వేయగల సాహితీ సవ్యసాచంటూ అంతెత్తుగా పొగిడారు.
ఇక రాబిన్హుడ్ సీరియల్లోకి ప్రవేశిద్దాం.